వీధి దీపాలు, పారిశుధ్యం, డ్రైనేజీ, సీసీ రోడ్లపై వినతి
మాదాపూర్ సర్కిల్ ఉప కమిషనర్కు గిరిజన సంక్షేమ సంఘం నేతల విన్నపం
శేరిలింగంపల్లి, ఆగస్టు 5 (సిటీటైమ్స్): నడిగడ్డ తాండలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించాలని గిరిజన సంక్షేమ సంఘం కమిటీ నాయకులు కోరారు. ఈ మేరకు మాదాపూర్ సర్కిల్-50 ఉప కమిషనర్ బాలకృష్ణను కలిసి వినతిపత్రం అందజేశారు.
తాండలో వీధి దీపాలు సరిగా వెలగకపోవడంతో రాత్రివేళ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త వీధి దీపాలతో పాటు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రధాన రహదారులు, పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేదని, పలుమార్లు ఫిర్యాదు చేసినా పరిస్థితి మారడం లేదని ఉప కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు రోడ్లపై నిలిచి మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రధాన వీధుల్లో కొత్త సీసీ రోడ్లు నిర్మించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఉప కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు సంఘం నాయకులు తెలిపారు.
కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు సభవత్ హన్మ నాయక్, ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్, గోవిందు సుధాకర్, దేవనూర్ నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
