చందానగర్లో కరపత్రాల ఆవిష్కరణ.. సీఐటీయూ నేత కొంగరి కృష్ణ పిలుపు
శేరిలింగంపల్లి, ఆగస్టు 7 (సిటీటైమ్స్): క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న చేపట్టనున్న ‘జైల్ భరో’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ శేరిలింగంపల్లి జోన్ కార్యదర్శి కొంగరి కృష్ణ పిలుపునిచ్చారు. చందానగర్ పీజేఆర్ స్టేడియంలోని గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో జైల్ భరో కరపత్రాలను ఆవిష్కరించారు.
దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆగస్టు 10న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు చేపట్టనున్నట్లు కృష్ణ తెలిపారు. అందులో భాగంగానే జైల్ భరోకు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తోందని కృష్ణ విమర్శించారు. అమెరికాతో కుదుర్చుకునే ఒప్పందాల వల్ల దేశీయ రైతాంగానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు దేశీయ మార్కెట్లోకి వస్తే రైతులు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు వ్యవసాయ కార్మికుల ఉపాధిపైనా ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలు, విధానాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో పలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
