మియాపూర్లో మొక్కల పంపిణీ.. నాటిన తాజా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
మియాపూర్, ఆగస్టు 8 (సిటీటైమ్స్): పర్యావరణ పరిరక్షణలో భాగంగా మియాపూర్ డివిజన్ మయూరినగర్ కాలనీలో మొక్కల పంపిణీ, మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. వీజీఆర్ డయాబెటిస్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ చారిటబుల్ ట్రస్ట్, విజయవాడ వారి సహకారంతో మయూరినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మియాపూర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాలనీవాసులకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేసి, అసోసియేషన్ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. వేగంగా విస్తరిస్తున్న నగరీకరణ నేపథ్యంలో పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం అత్యంత అవసరమన్నారు. ప్రతి ఇంటి వద్ద, ప్రతి కాలనీలో కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు భావితరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణలోనూ ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
వీజీఆర్ డయాబెటిస్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించేలా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఖలిదిండి రాజు, కిషోర్, హరికృష్ణ, ప్రవీణ్రెడ్డి, రమణరెడ్డి, నాగరాజు, కృష్ణకుమార్, సచిన్కుమార్, వరలక్ష్మి, అఖిలరెడ్డి, వీజీఆర్ డయాబెటిస్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు హరిబాబు, మహేశ్వర్రెడ్డి, పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.
