బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడిన యోధుడి స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకం
చందానగర్, ఆగస్టు 8 (సిటీటైమ్స్): ప్రజా వీరుడు పండుగ సాయన్న జయంతిని పురస్కరించుకుని చందానగర్ శాంతినగర్లో సతీష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు కొంగరి కృష్ణ ముదిరాజ్, అనిల్కుమార్ ముదిరాజ్, శంకర్ ముదిరాజ్, శ్రీనివాస్ ముదిరాజ్, రేవంత్ ముదిరాజ్, నాగరత్నం ముదిరాజ్ పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల కోసం పోరాడిన మహావీరుడు, తెలంగాణ గర్వకారణమైన పండుగ సాయన్న అని కొనియాడారు. ప్రజల కోసం పోరాడిన ఆయనను రాబిన్హుడ్గా పిలిచేవారని పేర్కొన్నారు. సామాజిక దృక్పథంతో ఎంతోమందికి సహాయం చేసిన సాయన్న, పెత్తందారీ వ్యవస్థను ఎదిరించి పోరాటం చేశారని తెలిపారు. మహబూబ్నగర్ ప్రాంతంలో ఆయన సాగించిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ముదిరాజ్ సమాజానికి చెందిన పండుగ సాయన్న ఆశయాలను నేటి తరం కొనసాగించాలని పిలుపునిచ్చారు.
బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేసి, పెత్తందారీ వ్యవస్థను ధైర్యంగా ఎదుర్కొన్న సాయన్న స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు. ఆయన త్యాగం, ధైర్యం, ప్రజాసేవ, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం భావితరాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
పండుగ సాయన్న జయంతిని ప్రతి ఏటా ఆగస్టు 8న తెలంగాణవ్యాప్తంగా గ్రామాలు, మండలాలు, పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయన సేవలను తెలంగాణ ప్రభుత్వం మరింతగా గుర్తించాలని, సాయన్న చరిత్రను భావితరాలకు చేరేలా తగిన చర్యలు చేపట్టాలని కోరారు.
కార్యక్రమంలో నందు, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
