భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు.. కాలనీ సంక్షేమం కోసం ప్రార్థనలు
నాగారం, ఆగస్టు 9 (సిటీటైమ్స్): ఘట్కేసర్ సర్కిల్ నాగారం డివిజన్ పరిధిలోని హెవెన్ డౌన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం బోనాల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో భాగస్వాములయ్యారు. దీంతో కాలనీలో భక్తి వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి పిట్టల ఈదయ్య మాట్లాడుతూ.. అమ్మవారి కృప, ఆశీస్సులు ఎల్లప్పుడూ కాలనీవాసులపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. బోనాల ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులకు కృతజ్ఞతలు తెలిపారు. కాలనీవాసులంతా ఐక్యంగా, ఉత్సాహంగా పాల్గొనడంతో వేడుకలు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు.
