- 216 గ్రామాల్లో 4జీ.. 47 గ్రామాలకు 5జీ సేవలు
- లోక్సభలో కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపీ కడియం కావ్య
న్యూఢిల్లీ, ఆగస్టు 12(సిటీటైమ్స్): వరంగల్ జిల్లాలో గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు 4జీ, 5జీ మొబైల్ సేవల విస్తరణ, నెట్వర్క్ సమస్యల పరిష్కారం, కొత్త మొబైల్ టవర్ల ఏర్పాటుపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత మూడేళ్లలో జిల్లాలో డిజిటల్ కనెక్టివిటీ విస్తరణపై వివరాలు కోరారు.
ఎంపీ ప్రశ్నకు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ బుధవారం సమాధానమిచ్చారు. జూన్ 2026 నాటికి వరంగల్ జిల్లాలో 218 గ్రామాలు ఉన్నాయని, వాటిలో 217 గ్రామాలకు మొబైల్ కనెక్టివిటీ, 216 గ్రామాలకు 4జీ సేవలు అందుతున్నాయని తెలిపారు. 47 గ్రామాల్లో 5జీ సేవలు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.
మిగిలిన ప్రాంతాలకూ సేవలు
జిల్లాలో డిజిటల్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ కడియం కావ్య అన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఒక్క గ్రామం కూడా నెట్వర్క్ సౌకర్యానికి దూరంగా ఉండకూడదని, 4జీతోపాటు 5జీ సేవలను విస్తరించాలని కోరారు. విద్య, వైద్యం, ఉపాధి, ప్రభుత్వ సేవలు, డిజిటల్ లావాదేవీలకు నాణ్యమైన మొబైల్, ఇంటర్నెట్ సేవలు కీలకమని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న నిధులను సద్వినియోగం చేసుకుని జిల్లాలో మిగిలిన నెట్వర్క్ లోటుపాట్లను వేగంగా పరిష్కరించాలని ఆమె కోరారు. ప్రజలకు మెరుగైన డిజిటల్ మౌలిక వసతులు కల్పించడమే తన లక్ష్యమని తెలిపారు.
