సిటిజన్ కాలనీలో ఆడుకుంటూ కనిపించకుండా పోయిన అనాస్ షాబాజ్ ఖాన్
ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల గాలింపు
శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (సిటీటైమ్స్): చందానగర్లోని సిటిజన్ కాలనీ, శివాజీనగర్ సమీపంలో ఐదేళ్ల బాలుడు అనాస్ షాబాజ్ ఖాన్ కనిపించకుండా పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడి తాత అబ్దుల్ అజీజ్ ఖాన్ తన అనారోగ్యంతో ఉన్న సోదరి షానాజ్ భానును చూసేందుకు తన చిన్న కుమారుడు, ఇద్దరు మనవళ్లతో కలిసి మధ్యాహ్నం 2 గంటలకు ఆమె నివాసానికి వెళ్లారు. సోదరి అపార్ట్మెంట్లోని రెండో అంతస్తులో ఉండగా.. అబ్దుల్ అజీజ్ ఖాన్, ఆయన కుమారుడు ఆమెతో మాట్లాడుతుండగా ఇద్దరు మనవళ్లు సోదరి మనవరాలితో కలిసి కింద ఆడుకుంటున్నారు. సుమారు 2.30 గంటలకు పిల్లలు పైకి వచ్చి అనాస్ షాబాజ్ ఖాన్ కనిపించడం లేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. అయినా బాలుడి ఆచూకీ లభించలేదు. బాలుడి ఎత్తు సుమారు రెండు అడుగులు, ముఖం గుండ్రంగా, ఛాయ తెల్లగా ఉంటుంది. ఇంగ్లిష్ మాట్లాడతాడని తెలిపారు. బాలుడు కనిపించకుండా పోయిన సమయంలో లేత పసుపు రంగు టీషర్టు, నీలం రంగు జీన్స్ ప్యాంటు, స్పోర్ట్స్ షూస్ ధరించి ఉన్నాడు. బాలుడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు చందానగర్ పోలీసులను ఆశ్రయించారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే చందానగర్ పోలీసులను సంప్రదించాలని కోరారు.
