ఆర్టీఓ కార్యాలయం సమీపంలో థార్ వాహనం, ద్విచక్రవాహనం ఢీ.. వనపర్తి జిల్లాకు చెందిన వ్యక్తి దుర్మరణం
కొండాపూర్, ఆగస్టు 10 (సిటీటైమ్స్): కొండాపూర్లోని ఆర్టీఓ కార్యాలయం సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో ఏపీ 40 హెచ్యూ 0555 నంబరు గల థార్ వాహనం, టీజీ 32 4957 నంబరు గల ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్న వనపర్తి జిల్లాకు చెందిన చెల్ల శ్రీనివాసులు (50) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ద్విచక్రవాహనం నడుపుతున్న శివకుమార్కు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని తదుపరి చర్యలు చేపట్టారు.
