నిందితుడి వద్ద 5 గ్రాముల గంజాయి స్వాధీనం
- సైబరాబాద్, ఆగస్టు 12 (సిటీటైమ్స్): యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్సీయూ)లో గంజాయి వినియోగానికి సంబంధించిన కేసులో పరారీలో ఉన్న నిందితుడిని గచ్చిబౌలి పోలీసులు, ఈగల్ టీమ్ సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. అరుణాచల్ప్రదేశ్కు చెందిన భిస్వజిత్ కలితా అలియాస్ బిస్వా (28) గోపన్పల్లిలో నివసిస్తూ యాక్టర్ ట్రైనర్గా పనిచేస్తున్నాడు. హెచ్సీయూ పూర్వ విద్యార్థి అయిన అతడిపై గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో క్రైం నంబర్ 1407/2026, ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 27 కింద కేసు నమోదైంది. ఈ కేసులో పరారీలో ఉన్న అతడిని ఆగస్టు 11న హెచ్సీయూ క్యాంపస్లో గుర్తించి అదుపులోకి తీసుకున్న సమయంలో 5 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆగస్టు 7న హెచ్సీయూ మెన్స్-ఎల్ హాస్టల్లో గంజాయి సేవిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో ఓ విద్యార్థి తాను 10 గ్రాముల ఎండు గంజాయిని రూ.500కు భిస్వజిత్ కలితా వద్ద కొనుగోలు చేసినట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సమాచారంతో దర్యాప్తు చేపట్టిన గచ్చిబౌలి పోలీసులు, ఈగల్ టీమ్ నిందితుడి ఆచూకీ గుర్తించి హెచ్సీయూ క్యాంపస్లో అదుపులోకి తీసుకున్నారు. గంజాయి సరఫరా మూలం, ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
