334 మౌలిక వసతుల పనులపై అధికారుల సమీక్ష.. వర్షాకాల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
సైబరాబాద్, ఆగస్టు 10 (సిటీటైమ్స్): సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలు, దెబ్బతిన్న రహదారులు, వర్షాకాలంలో నీరు నిలిచే ప్రాంతాల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో సోమవారం పోలీస్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ, హైడ్రా, టీజీఎస్పీడీసీఎల్, టీజీఐఐసీ, ఆర్అండ్బీ, ఎన్హెచ్ఏఐ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మొత్తం 334 రహదారి మౌలిక వసతుల పనులను సమీక్షించారు. ఇందులో 245 ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులకు రీకార్పెటింగ్, గుంతల పూడ్చివేత పనులను గుర్తించారు. వర్షాకాలంలో నీరు నిలిచే 85 ప్రాంతాలను గుర్తించి సమస్యకు పరిష్కారం చూపాలని నిర్ణయించారు. 53 ఫుట్పాత్, జంక్షన్ అభివృద్ధి పనులు, 25 ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు, 13 రహదారి విస్తరణ ప్రతిపాదనలపైనా సమీక్ష జరిగింది. ముఖ్యమైన జంక్షన్ల వద్ద ఫ్రీ లెఫ్ట్ల అభివృద్ధి, పనిచేయని ట్రాఫిక్ సిగ్నళ్ల పునరుద్ధరణ, ట్రాఫిక్కు ఆటంకంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, ఇతర మౌలిక వసతుల తరలింపు వంటి అంశాలపై కూడా చర్చించారు. గుర్తించిన పనులను నిర్దేశిత కాలపరిమితిలో పూర్తి చేయాలని, తరచూ ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాలు, బాటిల్నెక్స్ ఏర్పడే ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రహదారి భద్రతను మెరుగుపరచడంతో పాటు ట్రాఫిక్ రద్దీని తగ్గించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
