వనపర్తి, ఆగస్టు 5 (సిటీటైమ్స్):
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా నోట్ పుస్తకాలను అందిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం పెబ్బేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు.
ఇప్పటికే ఉచిత పాఠ్యపుస్తకాలను అందించగా, తాజాగా నోట్ పుస్తకాలు కూడా పంపిణీ చేయడంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గుతుందని అధ్యాపకులు పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని చదువులో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.
ఈ విద్యా సంవత్సరంలో పెబ్బేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం ప్రవేశాలు అధికంగా నమోదవడం పట్ల అధ్యాపక, బోధనేతర సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కళాశాలలపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో పెరుగుతున్న విశ్వాసానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రిన్సిపల్ ఓబుల్రెడ్డి, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
