ఇష్టారీతిన రోడ్డు దాటుతున్న పాదచారులు.. అవగాహనతో పాటు కఠిన చర్యలకు ఆదేశం
ఐటీసీ ఫ్రీ లెఫ్ట్ వద్ద ట్రాఫిక్ ప్రవాహంపై పరిశీలన
రోడ్డుపై అక్రమ క్యాబ్ పార్కింగ్ తొలగించాలని జేసీపీ సన్ప్రీత్ సింగ్ ఆదేశం
సైబరాబాద్, ఆగస్టు 5 (సిటీటైమ్స్): ఐకియా జంక్షన్లో పాదచారుల రాకపోకలు, ట్రాఫిక్ నిర్వహణను సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, ఐపీఎస్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మెట్రోతో పాటు ఇతర ప్రజా రవాణా వాహనాల్లో వస్తున్న వారిలో పలువురు నిర్దేశిత ప్రాంతాల్లో కాకుండా ఇష్టారీతిన రోడ్డు దాటుతున్న విషయాన్ని గుర్తించారు.
పాదచారుల భద్రత దృష్ట్యా జీబ్రా క్రాసింగ్లు, నిర్దేశిత ప్రాంతాల్లోనే రోడ్డు దాటేలా నిరంతరం అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు క్రమశిక్షణ పాటించని చోట అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం ఐటీసీ ఫ్రీ లెఫ్ట్ టర్న్ను పరిశీలించిన జేసీపీ.. అక్కడ వాహనాల రాకపోకలు, ప్రస్తుతం ఉన్న రహదారి సదుపాయాల తీరును పరిశీలించారు. ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు, రద్దీ తగ్గించేందుకు అవసరమైన ఇంజినీరింగ్, ట్రాఫిక్ నిర్వహణ మార్పులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
రోడ్డు వెంట అనధికారికంగా క్యాబ్లు పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్కు ఆటంకం ఏర్పడుతున్నట్లు గుర్తించిన ఆయన.. వాటిని వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. అక్రమ పార్కింగ్పై ప్రత్యేక తనిఖీలు చేపట్టి రహదారులపై వాహనాల రాకపోకలకు అడ్డంకులు లేకుండా చూడాలని ఆదేశించారు. ట్రాఫిక్ ఇంజినీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ప్రజల్లో అవగాహన.. ఈ మూడింటి సమన్వయంతోనే రహదారి భద్రతను మెరుగుపరచవచ్చని సన్ప్రీత్ సింగ్ పేర్కొన్నారు.
