వట్టినాగులపల్లిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి.. దర్యాప్తు చేపట్టిన గచ్చిబౌలి పోలీసులు
శేరిలింగంపల్లి, ఆగస్టు 7 (సిటీటైమ్స్): వట్టినాగులపల్లి వద్ద ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు పక్కనున్న కల్వర్టులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గురువారం సాయంత్రం డయల్-100కు అందిన సమాచారంతో గచ్చిబౌలి పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. వట్టినాగులపల్లి ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సిబ్బందికి సాయంత్రం 5 గంటల సమయంలో సమాచారం అందింది. కోకాపేట ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు పక్కనున్న కల్వర్టులో వ్యక్తి మృతదేహం ఉన్నట్లు తెలియడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు.
మృతుడి వయసు సుమారు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఎరుపు రంగు టీషర్ట్, గోధుమ రంగు షార్ట్స్ ధరించి ఉన్నట్లు తెలిపారు. ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఎవరన్నది, మృతికి కారణమేమిటన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.
