దాడులు, దూషణలు.. మెట్ల దారికి తాళం వేసినట్లు పరస్పర ఆరోపణలు
శేరిలింగంపల్లి, ఆగస్టు 8 (సిటీటైమ్స్): మురుగునీటి లీకేజీ, మెట్ల మార్గానికి తాళం వేయడం వంటి అంశాలతో మొదలైన వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పరస్పరం దాడులు, దూషణలకు పాల్పడ్డారంటూ ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండు కేసులు నమోదయ్యాయి.
దుర్గం మౌనిక ఫిర్యాదు ప్రకారం.. తన భర్తకు అన్న అయిన శ్రీను కుటుంబంతో కలిసి తమ ఇంటిపైనున్న భాగంలో నివసిస్తున్నాడు. వారి బాత్రూమ్ డ్రైనేజీ నుంచి వచ్చే మురుగునీరు తన ఇంటి వంటగదిలోకి లీకవుతోందని, పలుమార్లు చెప్పినా సమస్యను పరిష్కరించలేదని ఆమె పేర్కొంది. తన ఇంటికి ఆనుకుని ఉన్న మెట్ల మార్గానికి వేసిన తాళాన్ని కూడా పగులగొట్టారని తెలిపింది.
ఈ విషయమై ప్రశ్నించగా తన భర్త అన్న కుమారులు దుర్గం సతీష్, దుర్గం శ్రీహరి కుటుంబ సభ్యులతో కలిసి తనను దుర్భాషలాడి, చేతులతో కొట్టి రోడ్డుపైకి తోసివేశారని మౌనిక ఆరోపించింది. ఈ ఘటనలో తన తలకు గాయమైందని, తనను రక్షించేందుకు వచ్చిన కుమారుడు సాయి చరణ్పై కూడా దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదుపై క్రైమ్ నంబర్ 844/2026 కింద బీఎన్ఎస్ 74, 79, 115(2) రెడ్విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదైంది.
మరోవైపు.. దుర్గం లత ఇచ్చిన ఫిర్యాదులో మౌనిక, ఆమె కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేశారు. గత రెండేళ్లుగా మౌనిక తమ కుటుంబాన్ని వేధిస్తోందని, తరచూ అసభ్య పదజాలంతో దూషిస్తూ గొడవలకు దిగుతోందని లత పేర్కొంది.
జులై 30న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య మౌనిక తన ఇంటికి వచ్చి దుర్భాషలాడడంతో పాటు డ్రైనేజీ నీటిని ఇంట్లోకి పంపి, తనపై దాడికి ప్రయత్నించి వెళ్లిపోయిందని లత ఆరోపించింది. ఆగస్టు 6న ఉదయం సుమారు 8 గంటలకు మౌనిక, శోభన్ అనే అద్దెదారుతో కలిసి తన ఇంటికి వెళ్లే మెట్ల గేటుకు తాళం వేసి దారి మూసివేశారని తెలిపింది.
మౌనిక కుమార్తె ప్రియాంక తనను దూషించి, గర్భవతి అయిన తన కుమార్తెపై దాడికి ప్రయత్నించిందని లత ఆరోపించింది. మౌనిక కుమారుడు సాయి కూడా ఈ వేధింపుల్లో భాగస్వామిగా ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో తాము భయాందోళనలకు గురవుతున్నామని తెలిపింది. ఈ ఫిర్యాదుపై క్రైమ్ నంబర్ 845/2026 కింద బీఎన్ఎస్ 126(2), 79, 115(2) రెడ్విత్ 3(5) సెక్షన్ల కింద మరో కేసు నమోదైంది.
ఇరువర్గాల ఫిర్యాదులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
