
• అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: మాజీ కార్పొరేటర్ గంగాధర్రెడ్డి
గచ్చిబౌలి, ఆగస్టు 9 (సిటీటైమ్స్): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్పల్లి, ఎన్టీఆర్నగర్, రాయదుర్గం గ్రామాల్లో ఆషాఢ బోనాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ వి. గంగాధర్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గంగాధర్రెడ్డికి ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం గంగాధర్రెడ్డి మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆషాఢ, శ్రావణ మాసాల్లో తెలంగాణ ప్రజలు బోనాల పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారని, మన సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి ‘చీడపీడల నుంచి కాపాడు తల్లి’ అంటూ గ్రామదేవతను భక్తులు వేడుకుంటూ బోనాల వేడుకలను నిర్వహిస్తారని తెలిపారు. అమ్మవారి దీవెనల కోసం బోనం ఎత్తే ప్రతి ఆడబిడ్డ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిజమైన వారసురాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సీనియర్ నాయకులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ అధ్యక్షులు, బీజేపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
