శేరిలింగంపల్లిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈఆర్వో నారాయణ్ అమిత్ సమావేశం
ఎస్ఐఆర్ పురోగతిపై సమీక్ష.. ఆగస్టు 10 గడువుపై చర్చ
శేరిలింగంపల్లి, ఆగస్టు 6 (సిటీటైమ్స్): ఓటర్ల జాబితా సవరణపై శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్వో), జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్, ఐఏఎస్ ఆధ్వర్యంలో గురువారం సర్వపక్ష సమావేశం జరిగింది. శేరిలింగంపల్లి జోన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, నియోజకవర్గ పరిధిలోని సహాయ ఎన్నికల నమోదు అధికారులు (ఏఈఆర్వోలు) పాల్గొన్నారు.
ఓటర్ల జాబితా సవరణలో భాగంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల ముమ్మర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు ఆగస్టు 10తో గడువు ముగియనున్న నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతిని నారాయణ్ అమిత్ సమీక్షించారు. గడువు సమీపిస్తున్నందున ఓటరు నమోదు, మార్పులు, చేర్పుల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
ఓటర్ల జాబితా సవరణపై రాజకీయ పార్టీల ప్రతినిధులు పలు సూచనలు చేశారు. వాటిని పరిశీలించి నిబంధనల మేరకు తదుపరి చర్యలు చేపడతామని నారాయణ్ అమిత్ తెలిపారు. అర్హులైన వారందరికీ ఓటు హక్కు లభించేలా, జాబితాలో తప్పులకు తావులేకుండా చూడాలని సూచించారు. ఇందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో సహకరించాలని కోరారు.
