శేరిలింగంపల్లి, ఆగస్టు 23 (సిటీటైమ్స్): అంజయ్యనగర్లో ఏడంతస్తుల భవనం కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటనతో ఆ ప్రాంతంలోని బహుళ అంతస్తుల నిర్మాణాలపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భవన నిర్మాణానికి అవసరమైన అనుమతులు లేవని, నిర్ణీత సెట్బ్యాక్లు పాటించలేదని సీఎంసీ టౌన్ప్లానింగ్ విభాగం రాయదుర్గం పోలీసులకు ఇచ్చిన లేఖలో పేర్కొంది. ఈ నిర్మాణానికి జూన్ 17న షోకాజ్ నోటీసుతోపాటు మరో ఉత్తర్వు జారీ చేసినప్పటికీ.. పనులు కొనసాగి ఆగస్టు 22న భవనం కూలినట్లు తెలిపింది.
ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పక్క భవనం దెబ్బతిని ఒకరికి గాయాలయ్యాయి. నిర్మాణ నిబంధనల ఉల్లంఘన, నాణ్యత లేని నిర్మాణ సామగ్రి వినియోగం, సరైన సాంకేతిక పర్యవేక్షణ లేకపోవడం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని సీఎంసీ పేర్కొంది. భవన యజమానులు ఫర్హీన్ సిద్ధిఖ్, మహ్మద్ సాజిద్ తదితరులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను కోరింది. ఈ ఘటనపై మాదాపూర్ సర్కిల్-50 టౌన్ప్లానింగ్ బిల్డింగ్ పర్మిషన్ అధికారి యు. సంతోష్కుమార్ను సీఎంసీ కమిషనర్ సస్పెండ్ చేశారు.
2024లోనే అంజయ్యనగర్లో చిన్న స్థలాల్లో ఐదు, ఆరు అంతస్తుల భవనాల నిర్మాణం జరుగుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని చోట్ల ఏడు, ఎనిమిది అంతస్తుల నిర్మాణాలు సైతం ఉన్నట్లు అప్పట్లో గుర్తించారు. అదే సమయంలో సమీపంలోని సిద్ధిఖ్నగర్లో ఐదంతస్తుల భవనం పక్కకు ఒరిగిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనల నేపథ్యంలో అంజయ్యనగర్లో తక్కువ విస్తీర్ణంలోని స్థలాల్లో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలను గుర్తించే ప్రక్రియ చేపట్టినట్లు అప్పట్లో వెల్లడైంది. రెండేళ్లు గడిచినా తాజాగా ఓ బహుళ అంతస్తుల భవనం కూలి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో.. అప్పట్లో గుర్తించిన నిర్మాణాలపై తీసుకున్న చర్యలపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నోటీసులిచ్చినా.. నిర్మాణం ఆగలేదెందుకు?
2024లో అంజయ్యనగర్, సిద్ధిఖ్నగర్ తదితర ప్రాంతాలు అప్పటి శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో ఉండేవి. ప్రస్తుతం సర్కిళ్ల పునర్వ్యవస్థీకరణతో అంజయ్యనగర్ మాదాపూర్ సర్కిల్ పరిధిలోకి వచ్చింది. పరిధులు మారిన నేపథ్యంలో.. అప్పట్లో గుర్తించిన నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎన్ని నోటీసులు జారీ చేశారు? ఎన్ని నిర్మాణాలను నిలిపివేశారు? ఎన్ని భవనాలపై చర్యలు తీసుకున్నారు? ప్రస్తుతం వాటి పరిస్థితి ఏమిటి? అన్నది అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఘటనాస్థలాన్ని పరిశీలించి అంజయ్యనగర్లో ఇలాంటి నిర్మాణాలు మరిన్ని ఉన్నట్లు గుర్తించారు. సీఎంసీతో కలిసి ప్రత్యేక తనిఖీలు చేపడతామని ప్రకటించారు. దీంతో అంజయ్యనగర్తోపాటు మాదాపూర్ సర్కిల్లోని ఇతర ప్రాంతాల్లోనూ అనుమతులు, నిర్మాణ నిబంధనలపై సమగ్ర తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. 2024లోనే గుర్తించిన నిర్మాణాలపై అప్పటి నుంచి ఇప్పటివరకు తీసుకున్న చర్యల వివరాలను అధికారులు వెల్లడించాలి. జూన్లోనే నోటీసు అందుకున్న నిర్మాణం ఆగకపోవడానికి కారణమేంటి? రెండేళ్ల క్రితమే గుర్తించిన బహుళ అంతస్తుల భవనాల్లో ఇప్పుడు ఎన్ని నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి? వాటిపై ఏ చర్యలు తీసుకున్నారు? ఈ ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది.
