సామాజిక న్యాయానికి ప్రతీక సర్వాయి పాపన్న: జగదీశ్వర్గౌడ్
శేరిలింగంపల్లి, ఆగస్టు 5 (సిటీటైమ్స్): ప్రజల స్వాభిమానం, ధైర్యం, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చిరస్మరణీయ ప్రతీక అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జి వి.జగదీశ్వర్గౌడ్ అన్నారు.
రాయదుర్గంలో గౌడ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఏఐసీసీ నాయకుడు మధుయాష్కిగౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్గౌడ్, అశోక్గౌడ్తో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగదీశ్వర్గౌడ్ మాట్లాడుతూ.. అధికారం కోసం కాకుండా ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పాపన్న పోరాడారని పేర్కొన్నారు. అన్యాయాన్ని ఎదిరించి, అణచివేతకు వ్యతిరేకంగా నిలిచిన ఆయన జీవితం తెలంగాణ సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. మరుగునపడిన మహనీయులకు గుర్తింపు కల్పిస్తూ వారి చరిత్రను భావితరాలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. పాపన్న ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సామాజిక న్యాయం, సమానత్వం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గౌడ్ సంఘం ప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
