142 ధ్రువపత్రాల తనిఖీ.. 52 నకిలీవని తేల్చిన అధికారులు
తొలి విడతలో 7.. రెండో విడతలో ఏకంగా 45 గుర్తింపు
కళాశాలలపై చర్యలకు ఇంటర్ బోర్డుకు సూచన.. లేక్ పోలీసులకు ఫిర్యాదు
సైబరాబాద్, ఆగస్టు 5 (సిటీటైమ్స్): జూనియర్ కళాశాలలు సమర్పించిన ఫైర్ ఎన్వోసీల్లో పెద్దఎత్తున ఫోర్జరీ బయటపడింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) పరిధిలో 142 ఎన్వోసీలను హైడ్రా తనిఖీ చేయగా.. 52 నకిలీవని తేలింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన హైడ్రా.. నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డుకు సూచించింది. జులై 4న నెక్లెస్ రోడ్డులోని లేక్ పోలీస్స్టేషన్లోనూ ఫిర్యాదు చేసింది.
2025–26, 2026–27 విద్యా సంవత్సరాలకు సంబంధించి జూనియర్ కళాశాలల యాజమాన్యాలు సమర్పించిన ఫైర్ ఎన్వోసీలను హైడ్రా తనిఖీ చేస్తోంది. తొలి విడతలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల ఇంటర్మీడియట్ విద్యాధికారులు 76 ఎన్వోసీలను తనిఖీ కోసం పంపారు. హైడ్రా వద్ద ఉన్న రికార్డులతో వాటిని సరిపోల్చగా ఏడింటిని నకిలీవిగా గుర్తించారు.
రెండో విడతలో మరో 66 ఎన్వోసీలు తనిఖీకి రాగా.. వాటిలో ఏకంగా 45 నకిలీవని తేలింది. రెండు విడతల్లో కలిపి పరిశీలించిన 142 ఎన్వోసీల్లో 52 ఫోర్జరీ చేసినవిగా గుర్తించారు. ఈ ధ్రువపత్రాలు సమర్పించిన కళాశాలలపై తదుపరి చర్యలు చేపట్టాలని ఇంటర్ బోర్డుకు హైడ్రా సూచించింది.
నకిలీ ఫైర్ ఎన్వోసీలు వెలుగుచూసిన నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, వ్యాపార సముదాయాల నిర్వాహకులతో హైడ్రా సమావేశం నిర్వహించింది. ఫైర్ ఎన్వోసీల విషయంలో పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పించింది.
